తెలంగాణ కాంగ్రెస్(Telangana congress) వ్యవహారాలను పూర్తిగా ప్రక్షాళన చేసే దిశగా.. పార్టీ అధిష్టానం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. మధ్యప్రదేశ్ కు చెందిన సీనియర్ నాయకురాలు.. అగ్రనేత రాహుల్ గాంధీ బ్యాచ్ లో ముఖ్యురాలుగా పేరున్న మీనాక్షి నటరాజన్ను(Meenakshi natarajan).. తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ ను చేసింది. NSUI అధ్యక్షురాలిగా.. మధ్యప్రదేశ్ యువజన కాంగ్రెస్ అధ్యక్షురాలిగా.. ఏఐసీసీ కార్యదర్శిగా.. ఎంపీగా కీలక అనుభవం ఆమె సొంతం. సమస్యలను పరిష్కరించగల నేర్పరితనం.. అందరినీ ఒక్కతాటిపైకి తేగల వాక్చాతుర్యం ఆమె బలం. అందుకే.. కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో.. పార్టీ బాధ్యతలను అధిష్టానం ఆమె చేతికి అప్పగించింది. వచ్చీ రాగానే.. ఏ విషయాలపై మీనాక్షి దృష్టి పెడతారన్న విషయంపై.. పార్టీ వర్గాల్లోనే కాదు.. సామాన్య జనాల్లోనూ అప్పుడే చర్చ మొదలైంది.
రాష్ట్ర కాంగ్రెస్ లో.. బయటికి కనిపించే విషయాలతో పాటు.. కనబడని సమస్యలు కూడా చాలానే ఉన్నాయి. ముఖ్యంగా.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కులగణన విషయంలో వస్తున్న విమర్శలు, రెండో సారి సర్వే చేయాలన్న నిర్ణయంపై ఎదురవుతున్న అడ్డంకులు, ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రదర్శిస్తున్న దూకుడు.. ఈ వ్యవహారాలపై పార్టీలో అంతర్గతంగా ఉన్న అసంతృప్తి.. ఇలాంటి విషయాలపై మీనాక్షి ఫోకస్ చేసే అవకాశం ఉంది. అభిప్రాయ భేదాలను తీర్చి.. అందరినీ ఒక్క తాటిపైకి తీసుకువచ్చి.. అధిష్టానం నిర్ణయానికి అనుగుణంగా నేతలను లైన్ లో పెట్టే అవకాశం.. కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది.
Watch Video For More Details—>