ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy).. తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్నట్టు చెప్పారు. దేశంలో అత్యున్నత విద్యా సంస్థలను ఏర్పాటు చేసిన బ్రాండ్ నెహ్రూ (Nehru) సొంతమని అన్నారు. అధికారంలోకి వచ్చి.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుని 16 నెలలు దాటుతున్నా ఇప్పటికీ తనకంటూ ఓ బ్రాండ్ ఏదీ ఎందుకు క్రియేట్ చేసుకోలేదని తనను చాలా మంది అడుగుతుంటారని చెప్పిన రేవంత్.. వారందరికీ ఆన్సర్ ఇచ్చారు. యంగ్ ఇండియా స్కూల్స్.. తనకు మాత్రమే ప్రత్యేకమైన బ్రాండ్ అని స్పష్టం చేశారు. ఇక్కడ విద్యార్థులకు అత్యున్నత స్థాయిలో అందనున్న చదువు, ఆ తర్వాత వారికి కల్పించే ఉపాధి అవకాశాలే.. తను సృష్టించిన బ్రాండ్ అని తేల్చి చెప్పారు.
రంగారెడ్డి జిల్లా మంచిరేవుల (Manchirevu) పరిధిలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్(Young India Police School) ను ప్రారంభించిన సందర్భంగా.. ఈ బ్రాండ్ కామెంట్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కొందరు ఉద్యమ నేతలం అనుకుంటూ వారిక వారే బ్రాండ్లుగా అనుకుంటూ ఉంటారని పరోక్షంగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను (former Chief Minister KCR) ఉద్దేశించి విమర్శలు చేశారు. కానీ.. దేశానికే దార్శనికుడిగా పీవీ నరసింహారావు (PV Narasimha Rao) నిలిచారని మాజీ ప్రధాని సేవలు గుర్తు చేసుకున్నారు. అలాంటి జాతీయ నాయకుల అడుగుజాడల్లో తాను పని చేస్తూ.. యంగ్ ఇండియా యూనివర్సిటీని స్థాపించానని చెప్పుకొచ్చారు. కేజీ టు పీజీ వరకు ఇక్కడే చదివి జీవితంలో స్థరపడే అవకాశం విద్యార్థులకు అందజేస్తున్నట్టు వివరించారు.. రేవంత్.
యంగ్ ఇండియా విద్యాసంస్థల నిర్వహణకు నిధుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని.. వంద కోట్ల రూపాయలతో (one hundred crore rupees) కార్పస్ ఫండ్ ను సమకూర్చుకోవాల్సిన అవసరం కూడా ఉందని రేవంత్ చెప్పారు. ఆ దిశగా.. తాను అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు స్పష్టం చేశారు. ఇంతటి ఉన్నతమైన విద్యాసంస్థల్లో చేరే విద్యార్థులు.. కచ్చితంగా దేశ భవితగా మారతారని ఆశాభావం వ్యక్తం చేశారు. రేవంత్ కామెంట్లపై సానుకూల స్పందనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు.. ప్రస్తుతం నడుస్తున్న ప్రభుత్వ విద్యాసంస్థల్లో ముందుగా వసతులు మెరుగు పరచాలని.. పూర్తి స్థాయిలో నియామకాలు చేపట్టాలని.. వర్సిటీల్లో అధ్యాపకుల కొరత తీర్చాలని కూడా డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ఇలాంటి సమస్యలు పరిష్కరిస్తేనే.. విద్యారంగాన్ని ప్రక్షాళన చేసిన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పూర్తి స్థాయి ప్రత్యేకమైన బ్రాండ్ సొంతం చేసుకుంటారని.. విద్యార్థులు కూడా భవిష్యత్తులో రేవంత్ సేవలు తలుచుకునే అవకాశం ఉంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.