భారత్ రాష్ట్ర సమితి (BRS)లో.. కేటీఆర్ (KTR) నాయకత్వంపై మరోసారి ప్రశంసలు కురుస్తున్నాయి. వరంగల్ (Warangal) వేదికగా లక్షలాదిమంది ప్రజలతో భారీ స్థాయిలో.. ప్రత్యర్థి పార్టీలు కూడా విస్తుపోయే రీతిలో.. బహిరంగ సభను విజయవంతం చేసిన క్రెడిట్ ను కేటీఆర్ కు ఇస్తున్నారు.. రాజకీయ విశ్లేషకులు. తెలంగాణలోని ఉమ్మడి పది జిల్లాల నుంచి.. పార్టీ ముఖ్య నాయకులను, మాజీ మంత్రులను సంఘటితం చేసి.. ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం 30 నుంచి 40 వేల మంది ప్రజలను సమీకరించేలా ఏర్పాట్లు చేసిన తీరుకు.. వాటిని విజయవంతం చేసిన కేటీఆర్ నిర్వహణ సామర్థ్యానికి.. పార్టీ కార్యకర్తలు కూడా శభాష్ అంటున్నారు.
15 నెలలుగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy).. రకరకాల సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. వాటితో ప్రజలు చాలావరకు లబ్ధి పొందుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) కు హైదరాబాద్ (Hyderabad) ను కేంద్రంగా చేస్తామంటూ ఓ ప్రతిపాదన.. ఫ్యూచర్ సిటీ (Future City) అంటూ మరో ప్రతిపాదన.. భారత్ సబ్మిట్ (Bharat Submit) అంటూ అంతర్జాతీయ అతిధులతో ఘనమైన సదస్సు.. వ్యవసాయానికి, ఇతర రంగాలకు తగిన రీతిలో ప్రోత్సాహం.. ఇలా రకరకాల కార్యక్రమాలను నిర్వహించుకుంటూ పోతున్న రేవంత్ రెడ్డి.. ప్రజల్లో పట్టు పెంచుకునే సమయంలో.. సరిగ్గా ఈ బహిరంగ సభ నిర్వహించి అందరి చూపులు తమ వైపు తిప్పుకునేలా చేశారు కేటీఆర్.
అంతేకాక.. చాలా కాలంగా పార్టీ అధినేత కేసీఆర్ (KCR) ప్రజల్లోకి రావడం లేదు. ప్రతిపక్ష నాయకుడిగా కూడా శాసనసభ సమావేశాలకు హాజరు కావడం లేదు. ఈ విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీ (Congress Party) నేతలు అవకాశం చిక్కినప్పుడల్లా కేసీఆర్ పై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. వారందరికీ కెసిఆర్ తోనే సమాధానం చెప్పించినట్టుగా.. ఈ సభను కేటీఆర్ ప్లాన్ చేసి ఉంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకు తగినట్టుగానే.. రేవంత్ రెడ్డి పరిపాలనపై కేసీఆర్ నిప్పులు చెరగడం.. గతంలో తన వాగ్దాటిని ప్రదర్శించి జనాన్ని ఆకట్టుకున్నట్టుగా మరోసారి కెసిఆర్ విరుచుకుపడటం.. అంతా కేటీఆర్ ప్లాన్లో భాగమై ఉంటుందని అనుకుంటున్నారు.
మరో ప్రధానమైన విషయం ఏంటంటే.. వరంగల్ సభలో ఏర్పాటు చేసిన బాహుబలి వేదిక (Baahubali Stage).. ఆ వేదికపై ప్రదర్శించిన డిజిటల్ ఫ్లెక్సీలు. ఈ విషయాన్ని ఎందుకు అంత స్పష్టంగా ప్రస్తావించాల్సి వస్తోందంటే.. రజతోత్సవ (Rajotsava) సభ అంటూ డిజిటల్ తెరపై ప్రదర్శించిన ఫ్లెక్సీలో అధినేత కేసిఆర్ తో పాటుగా.. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోటో మాత్రమే కనబడింది. పార్టీకి ట్రబుల్ షూటర్లుగా ఉన్న నేతల ఫోటోలు కానీ.. సీనియర్ నాయకులు కానీ.. ఉద్యమకారులుగా ఉంటూ మంత్రులుగా పనిచేసి ప్రస్తుతం మాజీలుగా ఉన్న నాయకుల ఫోటోలు కానీ.. చివరికి వరంగల్ వేదికగా సభ నిర్వహిస్తున్నా కూడా.. తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త అయిన స్థానికుడు.. ప్రొఫెసర్ జయశంకర్ (Professor Jayashankar) ఫోటోను కానీ కనబడకుండా జాగ్రత్తలు తీసుకోవడం అనేది.. కేటీఆర్ నాయకత్వాన్ని వెలుగులోకి మరింతగా తీసుకువచ్చే ఎత్తుగడలో భాగమేనని అనలిస్టులు భావిస్తున్నారు. కాస్త జాగ్రత్తగా గమనిస్తే ఇందులో కూడా నిజం లేకపోలేదు అన్న అభిప్రాయాన్ని ప్రజలు కూడా వ్యక్తం చేస్తున్నారు.